యోగా సందడి
18-06-2025 08:16:07
2: ANDHRA-PRADESH

OFM , Publish Date - Jun 18 , 2025 | 01:27 AM

విశాఖపట్నంలో ఎక్కడ చూసినా యోగాంధ్రాపైనే చర్చ జరుగుతోంది.

ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అంతా విశాఖలోనే మకాం

బీచ్‌ రోడ్డులో 3.5 లక్షల మందితో యోగాసనాలు

అనుసంధానమైన రహదారులు, విద్యా సంస్థలు, మైదానాల్లో మరో లక్షన్నర మందికి ఏర్పాట్లు

బీచ్‌రోడ్డులో గ్రీన్‌ మ్యాట్లు

ప్రతి వంద మందికి టాయిలెట్‌.. వేయి మందికి వైద్య శిబిరం

యోగా ప్రాక్టీస్‌ చేసే వారికే బీచ్‌ రోడ్డులో అవకాశం

బీచ్‌ రోడ్డులో రాకపోకలు నిషేధం

విశాఖపట్నం, జూన్‌ 17 (OFM):

విశాఖపట్నంలో ఎక్కడ చూసినా యోగాంధ్రాపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కీలకమైన ఉన్నతాధికారులు, కోస్తా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు నగరంలోనే మకాం పెట్టారు. కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ జాయింట్‌ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు అంతా ఇక్కడే ఉన్నారు. ఈ నెల 21వ తేదీన కార్యక్రమం పూర్తయి ఆహ్వానితులంతా తిరిగి ఇళ్లకు చేరేంత వరకూ వీరంతా విశాఖలోనే ఉండి ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

మొత్తం ఐదు లక్షల మందితో యోగా వేడుకలు నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. విశాఖ నుంచి భీమిలి వరకూ బీచ్‌ రోడ్డులో 3.5 లక్షల మందికి, అనుసంధానంగా ఉన్న రహదారులు, విద్యా సంస్థలు, మైదానాల్లో మిగిలిన లక్షన్నర మందికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్‌రోడ్డును ఏర్పాట్ల కోసం పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం నుంచి బీచ్‌రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. 21వ తేదీ సాయంత్రం వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయి. బీచ్‌రోడ్డులో గ్రీన్‌ మ్యాట్‌ పరుస్తున్నారు. ప్రతి వేయి మందికి ఒక కంపార్ట్‌మెంట్‌ చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. ఆహ్వానితులకు కంపార్ట్‌మెంట్‌ నంబరుతో పాటు అక్కడ సీటు నంబర్‌ కూడా ఇస్తారు. ఒకరికి బదులు మరొకరు, ఎవరికి నచ్చినట్టు వారు వెళ్లడానికి లేదు. ఎమ్మెల్యేలు కూడా అనుచరులను వెంటేసుకొని రావద్దని సీఎం చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆసనాలు వేసేవారినే అనుమతించాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పది వేల మందితో పోలీసు బందోబస్తు పెట్టారు. తీరం పొడవున ఎక్కడ ఎటువంటి ఘటన జరిగినా రికార్డు అయ్యేలా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వంద మందికి ఒక టాయిలెట్‌, ప్రతి కంపార్ట్‌మెంట్‌కు ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ వర్షం పడితే బీచ్‌ రోడ్డులో కార్యక్రమం నిర్వహించడం ఇబ్బందిగా ఉంటుందని ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో మరో వేదిక ఏర్పాటుచేశారు. అక్కడ 25 వేల మంది గిరిజన యువతతో కార్యక్రమం నిర్వహించడానికి అన్ని పనులు పూర్తిచేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకురావడానికి వేలాది బస్సులు పెట్టారు. ఉన్నతాధికారులు ఏర్పాట్లపైన, ప్రజాప్రతినిధులు జన సమీకరణపైనా వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు. అంతా కలసి కార్యక్రమం విజయవంతం చేయడానికి సమష్టిగా పనిచేస్తున్నారు.

యోగాంధ్రాకు 2 వేల సీసీ టీవీ కెమెరాలు

ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు

హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత

వీఎంఆర్‌డీఏలో మంత్రులు, కూటమి నేతలు, అధికారులు సమావేశం

విశాఖపట్నం, జూన్‌ 17 (OFM):

విశాఖపట్నం-భీమిలి బీచ్‌ రోడ్డులో ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం కోసం రెండు వేల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వీఎంఆర్‌డీఏలో ఆమె మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బాలవీరాంజనేయస్వామి, అచ్చెన్నాయుడు, జనార్దన్‌రెడ్డి, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. లక్షలాది మంది హాజరవుతున్నందున ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా కార్యక్రమం కొనసాగేలా చర్యలు చేపట్టామన్నారు. విశాఖ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఆర్కే బీచ్‌ రోడ్డు మూసివేత

21 వరకూ వాహనాల రాకపోకలు నిలిపివేత

19-21 మధ్య పార్కు హోటల్‌ నుంచి భీమిలి వరకూ కూడా...

నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ

మహారాణిపేట, జూన్‌ 17 (OFM):

సాగరతీరంలో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ అంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ సహా వివిధ దేశాల ప్రతినిధులు, రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఐదు లక్షల మంది ఈ వేడుకలకు హాజరవుతున్నారని తెలిపారు. భద్రతతో పాటు యోగా కార్యక్రమంలో పాల్గొనే ఔత్సాహికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో కొన్ని రకాల ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ ఆర్కే బీచ్‌రోడ్డు (ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి పార్కు హోటల్‌ జంక్షన్‌ వరకూ)ను మూసివేయనున్నట్టు తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల 19-21 మధ్య పార్కు హోటల్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకూ వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ సూచనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ బాగ్చి కోరారు.

**** ONGOLE FIRST MEDIA ****