2: ANDHRA-PRADESH
OFM
, Publish Date - Jun 18 , 2025 | 01:32 AM
పరవాడ ఫార్మా సిటీలోని సాయి శ్రేయాస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ మందుల తయారీలో నిబంధనలు ఉల్లంఘిస్తోంది.
ఉత్పత్తి నిలిపివేత
ఏపీ పీసీబీ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ వేర్వేరుగా ఉత్తర్వులు
కంపెనీలో అన్నీ అడ్డగోలు పనులే
భద్రత లేదు...శిక్షణ లేదు.. రికార్డులు లేవు
ఈ నెల 12న విష వాయువులు విడుదల కావడంతో ఇద్దరు భద్రతా విభాగం అధికారులు మృతి
(విశాఖపట్నం-OFM)
పరవాడ ఫార్మా సిటీలోని సాయి శ్రేయాస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ మందుల తయారీలో నిబంధనలు ఉల్లంఘిస్తోంది. ఉద్యోగుల భద్రతను గాలికి వదిలేసింది. ఇద్దరి ప్రాణాలు పోయిన తరువాత ఇవన్నీ బయటకు రావడం గమనార్హం. అక్కడి అడ్డగోలు వ్యవహారాలు పరిశీలించిన అధికారులు తక్షణమే కంపెనీలో ఉత్పత్తులు నిలిపివేయాలని ఆదేశించారు.
సాయి శ్రేయాస్ (ఎస్ఎస్) ఫార్మా కంపెనీలో ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల ప్రాంతంలో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటు పరిశీలనకు వెళ్లిన ఇద్దరు భద్రతా విభాగం అధికారులు ట్యాంకు మ్యాన్హోల్ నుంచి వచ్చిన హెచ్2ఎస్ వాయువు పీల్చి అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. మరో ఉద్యోగి స్పృహ కోల్పోగా కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఎటోరికోక్సిబ్ అనే మందు తయారుచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తరువాత కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డ్రగ్ కంట్రోల్ విభాగం, అగ్నిమాపక సిబ్బంది తదితరులు అక్కడకు వెళ్లి అన్నీ పరిశీలించారు. ఘటనా స్థలంలోనే ఉద్యోగులు ఇద్దరూ మరణించినట్టు తెలుసుకున్నారు. దీనిపై ఏ శాఖకు ఆ అధికారులు నివేదికలు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నతాధికారులు తక్షణమే ఆ కంపెనీలో అన్ని రకాల ఉత్పత్తులు నిలిపివేయాలని ఏపీ పీసీబీ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు.
నివేదికలో పేర్కొన్న లోపాలు
- సాయి శ్రేయాస్ కంపెనీ బల్క్ డ్రగ్, ఇంటర్మీడియట్ మందులు తయారు చేస్తుంది. రెండు ఉత్పత్తి విభాగాలు ఉన్నాయి. ఎటోరికోక్సిబ్ అనే మందు తయారీ మూడో దశలో ప్రమాదం జరిగింది.
- కంపెనీలో ఉత్పత్తి చేసే మందులు, వాటి నుంచి దశల వారీగా వెలువడే వ్యర్థాలు, వాటిని బయటకు తరలించే విధానంపై ఎక్కడా ఎటువంటి రికార్డులు నిర్వహించడం లేదు.
- ఉద్యోగుల నియామకం, వారికి అవసరమైన శిక్షణ, మందుల తయారీలో తీసుకోవలసిన భద్రతపై అవగాహన కల్పించడం వంటివి అక్కడ అమలు చేయడం లేదు.
- మందులను అర్హత పొందిన నిపుణుల పర్యవేక్షణలో తయారుచేయాలి. కానీ అక్కడ అలా చేయడం లేదు. అర్హత లేనివారే అన్నిపనులు చేస్తున్నారు.
- ప్రతి మందును బ్యాచ్ల వారీగా తయారుచేసి బయటకు పంపుతారు. అవన్నీ సక్రమంగా ఉన్నాయని నిపుణులు సర్టిఫై చేయాలి. కానీ అర్హత లేనివారితో ఈ పనులన్నీ చేయిస్తున్నారు.
- కంపెనీలో స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) ఏదీ అమలు చేయడం లేదు. దేనికీ సరైన రికార్డులు లేవు.
- ప్రాసెసింగ్ ప్రక్రియలో పాల్గొన్న వారికి సరైన భద్రతా పరికరాలు లేవు.
- ప్రమాదం జరిగినప్పుడు ఈటీపీతో అనుసంధానమైన స్క్రబ్బర్ స్విచ్ ఆన్ చేయలేదని గుర్తించారు.
- ఏ మందు తయారీలో ఏ వ్యర్థాలు ఎంత పరిమాణంలో వస్తాయో సంస్థ వద్ద అంచనాలు లేవు. ముందస్తు జాగ్రత్తల కోసం తీసుకోవలసిన ప్రణాళిక లేదు. ఇవన్నీ పరిశీలించిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉత్పత్తుల తయారీ నిలిపివేయాలని ఆదేశించింది.
పరిమితికి మించి వీఓసీ
గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో కలిసిపోయే వ్యర్థాలను ‘ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్’ (వీఓసీ)గా వ్యవహరిస్తారు. ఎక్కడైనా విషవాయువులు గాలిలో కలిసినట్టు తెలిసినా, వాసన వచ్చినా వీఓసీని పరికరాల ద్వారా కొలుస్తారు. సాయి శ్రేయాస్లో హెచ్2ఎస్ విడుదలై ఇద్దరు చనిపోయిన తరువాత కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మరుసటిరోజు వెళ్లి వీఓసీని నమోదు చేశారు. ఈటీపీ, స్టోరేజీ ట్యాంకు, ప్లాంటు లోపల 107-114 పీపీఎం ఉన్నట్టు నమోదైంది. ఇది చాలా...చాలా ప్రమాదకర స్థాయి. భరించలేని దుర్గంధం వస్తుంది. ఆ స్థాయిలో హెచ్2ఎస్ విడుదలై పర్యావరణానికి హాని కలుగజేసినందున ఇకపై ఉత్పత్తులు చేయకూడదని ఏపీపీసీబీ ఆదేశించింది.